Published On Aug 14, 2020
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం గుండా ప్రవహించే ప్రధాన నదులలో గోదావరి ఒకటి. దీని పుట్టుక స్ధానము మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోగల త్రయంబకం వద్ద ఉన్న బ్రహ్మగిరి పర్వతం. ఇది అరేబియా సముద్రము నుండి 80 కి.మీ.ల దూరంలో, ముంబాయి నుండి 110 కి.మీ దూరంలో, సముద్రమట్టానికి 1067 మీటర్ల ఎత్తులో ఉంది. త్రయంబకంలో పుట్టి మహారాష్ట్ర గుండా 770 కి.మీ ప్రవహించి, బాసర వద్ద తెలంగాణ లోనికి ప్రవేశించి మంచిర్యాల, కాళేశ్వరం, పేరూరు, చర్ల, దుమ్ముగూడెం మీదుగా భద్రాచలం వద్ద ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించి కూనవరం, పోలవరం, పట్టిసీమ లను దాటుకొని, రాజమహేంద్రవరం వద్ద వెడల్పాటి నదిగా మారి, దిగువున ఉన్న ధవళేశ్వరం వద్ద తూర్పుగా, దక్షిణంగా రెండు పాయలుగాచీలి బంగాళాఖాతములో సంగమిస్తుంది. ధవళేశ్వరం వద్ద రెండుగా చీలిన గోదావరి తూర్పు పాయను గౌతమి అంటారు. ఇది 70 కి.మీ. ప్రవహించి, ప్రధానంగా వృద్ధగౌతమి, కోరింగ, నీలరేవు అను మూడు భాగాలుగా చీలి యానాం వద్ద సముద్రంలో కలుస్తుంది. అలాగే దక్షిణ పాయను వశిష్ట అంటారు. ఇది దక్షిణంగా 40 కి.మీ. ప్రయాణించి వశిష్ట, వైనతేయగా చీలి అటు అంతర్వేది, ఇటు ఓడలరేవు వద్ద సముద్రంలో కలుస్తుంది.