Published On Aug 14, 2024
అర్జుని సినిమాలోని మధుర మధురతర మీనాక్షి పాటలో విశేషాలు
ఐదువేలకు పైగా సినిమా పాటలు రచించిన ఏకైక తెలుగు కవి వేటూరి సుందరరామమూర్తి గారు. చిలిపి పాటల్లో కూడా కవిత్వాన్ని చిలికించే వేటూరి, ఇక సందర్భశుద్ధి ఉన్న సన్నివేశానికి పాట రాయాల్సి వస్తే మాత్రం త్రివికముడైపోతారు. శబ్దాలతోను, అర్థాలతోను పాటకు అలంకారాలు చేస్తారు. అటువంటి అపురూపమైన పాటల్లో ఒకటి.. మహేశ్ బాబు నటించిన అర్జున్ సినిమాలోని, మధుర మధురతర మీనాక్షీ పాట. ముందుగా ఇంతమంచి పాటను వేటూరిగారితో వ్రాయించుకున్న దర్శకుడు గుణశేఖర్ గారికి, ఈ పాటకు ఉత్తమ స్థాయి సంగీతాన్నందించిన మణిశర్మ గారికి నమస్కరించుకుంటూ వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాం.
పాట సందర్భం ఏంటంటే.. తెలుగు ప్రాంతానికి చెందిన అమ్మాయి, తమిళప్రాంతానికి చెందిన అబ్బాయి ప్రేమించుకుంటారు. అబ్బాయిది మధుర. కథాగమనంలో భాగంగా ఆ అమ్మాయి తమ్ముడైన కథానాయకుడు, తన అక్కను, తల్లిదండ్రులను తీసుకొని మధురకు వెళతాడు. అక్కడ మీనాక్షీ దేవి ఆలయ ప్రాంగణంలో కథానాయకుడు, వాళ్ళ అక్కా కలిసి అమ్మవారిపై పాడే పాట ఇది. ఈ పాట మూడు అంశాలతో పెనవేసుకుని ఉంటుంది. మీనాక్షీ అమ్మవారి గుణాలను కీర్తించడం, తెలుగు, తమిళప్రాంతాలకు ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను గుర్తుచేసుకోవడం, అలానే కథానాయకుడు తన అక్క గురించి అమ్మవారికి విన్నవిస్తూ ఆమెను చల్లగా చూడమని కోరుకోవడం, ఇలా మూడు విషయాల సమాహారంగా ఈ పాట సాగిపోతుంది. ఇక ఈ పాటలో విశేషాలను, వేటూరి గారి పాటవాన్ని చెప్పుకుందాం.
#veturi #telugulyrics #telugusongs